గంగావతరణం
గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు. తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగునని పండితులు అంటున్నారు. గంగాదేవి మహిమను విన్నా చదివినా సకల వ్యాధులు నశించి, శుభ ఫలితాలు కలుగును.
భీష్మోవాచ:
భారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై గంగానది మహిమలు వర్ణించాడు. ఇందులో భాగంగా గంగా, యమున, సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగే పుణ్యం యజ్ఞయాగాది దానాదులు చేసినదానికంటే అధికమని చెప్పాడు. ఇంకా గంగా మహిమ గురించి భీష్ముడు ఏమన్నాడంటే.. గంగాజలం కొంచమైనా దేహమునకు సోకినటై్లతే సకల పాపములు నశిస్తాయి. నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును.
ఏడుతరాలకు శుద్ధి:
గంగాస్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయేకాక ఏడు తరముల వారు పరిశుద్ధులగుదురు. గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసినదానికంటే అధికం. గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానంము కలిగించుచూ పాపములను దూరం చేయును.మరణకాలమందు గంగను తలచినవారికి మోక్షం లభించును. గంగా నది మహిమలు చెప్పుకొను వారికి పాప భయం, రాజ భయం, చోర భయం, భూత భయం మొదలైన భయములు నశించును.
గంగాప్రాశస్థ్యం:
గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాధలు ఉన్నాయి. భాగవతంలోను,బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాథలున్నాయి. జగజ్జనని (అంతర్ధానాంశయై) నిరాకారయైన గంగ బ్రహ్మదేవుని కమండలమందుండెను. ఒకమారు శంకరుడు రాగములాలాపించినపుడు నారాయణుడు ద్రవీభవించెను. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలమును తాకించగా నిరాకార గంగ జలమయమయ్యెను. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము - అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.
భగీరధుడు:
సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమైపోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.
తాతముత్తాతలకు సద్గతి: భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా దూకుడు భరించగల నాధుడెవ్వరు? అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆ్రశ్రమాన్ని ముంచెత్తి, జాహ్నవి అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.స్వర్గంలో మందాకినిగా, భూలోకంలో గంగ లేదా అలకనందగా, పాతాళంలో భోగవతిగా మూడు లోకాల్లో ప్రహించినందున గంగను త్రిపథగ అంటారు.
No comments:
Post a comment